అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ రైనో కొమ్ముల కాల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖడ్గమృగం కొమ్ములు నిల్వ ఉన్నాయి. దీంతో ఈ రైనో కొమ్ములను కాల్చాలని అస్సాం రాష్ట మంత్రి వర్గ సమావేశం నిర్వహించిన సందర్భంగా నిర్ణయించారు. దానికంటే ముందు అటవీ శాఖ పునః పరిశీలన తరువాత రైనో కొమ్ముల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేశారు. అస్సాం ప్రభుత్వం మొత్తం 2 వేల 479 ఖడ్గ మృగం కొమ్ములు ఉన్నట్టు లెక్క గట్టింది.
ఖడ్గమృగాలను సంరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ కాల్చివేత ప్రక్రియకు పూనుకుంది అసోం ప్రభుత్వం. ఖడ్గమృగాల కొమ్ములకు ఔషధ ప్రాముఖ్యం ఉన్నదనే ప్రచారం ఉంది. దీంతో డబ్బులకు ఆశపడి వాటి కొమ్ములను సొమ్ముచేసుకునేందుకు వేటగాళ్లు అటవీ అధికారుల కళ్లగప్పి ఖడ్గమృగాలను వేటాడుతున్నట్టు గుర్తించారు అధికారులు. రైనో కొమ్ముల కోసం అతి దారుణంగా వాటిని హతమార్చి కొమ్ములను ఊడదీసుకు పోతున్నారు వేటగాళ్లు.
ఈ ఖడ్గమృగం కొమ్ముల కాల్చివేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వచ్చారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు ఇతర రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ఈ చర్య అస్సాం ప్రభుత్వం అలాగే అటవీ శాఖ చేస్తున్న “ఖడ్గమృగం పరిరక్షణ” ప్రచారంలో ఓ మైలురాయిగా నిలిచింది.