నిజానికి బ్రిటిష్ ప్రభుత్వంలోనే కాపులు బీసీల్లో ఉండేవారు అయితే బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్లు రద్దు చేశారు. అయితే చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డిలు వాటిని పునరుద్ధరించినా న్యాయ వివాదాల్లో చిక్కుకోవడంతో అది సాకారం కాలేదని కాపు నేతలు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హమీ ఇచ్చి ముస్లింలు, ఇతర కులాలను మాత్రమే బీసీల్లో చేర్చారన్నారు. అయితే తమిళనాడు, కర్ణాటక, రాజస్ధాన్ వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయని ఏపీలో కూడా అలా చేయాలనే డిమాండు వినిపిస్తుందన్నారు. అవసరం అయితే మంజునాథ కమీషన్ రిపోర్టును సుప్రీంకోర్టు ముందు ఉంచి కాపులకు న్యాయం చేయాలని అంటున్నారు.
మరోవైపు కాపులకు రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం నిర్వహించిన ఉద్యమంలో దురదృష్టవశాత్తు రైలు దగ్ధం కావడం కాపు ఉద్యమం కాస్త స్తబ్దుగా మారిందంటున్నారు. అయితే ఇప్పుడు కేంద్రమే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు విషయంలో స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చేయడంతో సీఎం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అంటున్నారు. కరోనా కారణంగా రెండున్నరేళ్లు ఎదురు చూశామని ఇక ఓపిక నశించిందన్న వారు ఇక ముఖ్యమంత్రిపై యుద్దమే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని లేఖల ద్వారా తెలియజేశామని అయితే సమాధానం లేదని అన్నారు. అయినా ప్రజాస్వామ్యయుతంగా నియోజకవర్గానికి వెయ్యి ఉత్తరాలు చప్పున ముఖ్యమంత్రికి కాపు రిజర్వేషన్లపై పోస్టు కార్డులు రాయాలని నిర్ణయించారు. అయితే ఈ ఉత్తరాల్లో గతంలోలా అభ్యర్థనలు కాకుండా హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించారు.