అక్టోబర్లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20 కోసం భారత్కు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది. దాయాది దేశం నుంచి ఆటగాళ్లు ఇక్కడికి ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేయనుంది. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్కు వెల్లడించినట్టు సమాచారం. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా సమస్య తీరిపోయింది. అయితే మ్యాచ్లు చూడడానికి అభిమానులు సరిహద్దులు దాటి వచ్చేందుకు అనుమతించడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దీన్ని త్వరలోనే పరిష్కారం అవుతుందని మేము ఐసీసీకి హామీ ఇచ్చాం’’ అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు మీడియాకు వెల్లడించారు.
కాగా.. ఐసీసీ ఈ సమావేశంలో టీ20 ప్రపంచ కప్కు సంబంధించి మిగతా విషయాలపై కూడా చర్చించడం జరిగింది. పొట్టి ఫార్మాట్ నిర్వహించే వేదికలపై కూడా స్పష్టత ఇచ్చింది. మొత్తం తొమ్మిది వేదికల్లో టోర్నీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన మ్యాచ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల, లక్నోలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.