ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-పాకిస్తాన్‌ దేశాల మధ్య రాజకీయ చిచ్చు.. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా చెరిపేశాయి. దీంతో దాదాపు దశాబ్ద కాలంగా ఈ రెండు జట్లూ కలిసి ఒక్క సిరీస్‌లో కూడా ఆడింది లేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టోర్నీల్లో మాత్రం అడపాదడపా పోటీ పడుతుండగా.. ప్రతి సారీ టీమిండియానే విజయం కేతనం ఎగురవేస్తోంది. కాగా.. తాజాగా మళ్లీ ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పోటీపడనున్నాయి. అయితే ఈ టోర్నీ ఈ ఏడాది భారత్‌లో జరగనుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు ఎన్నో ఏళ్ల తరువాత భారత్‌‌లో అడుగుపెట్టనుంది. కానీ, భారత్‌కు పాక్ జట్టు వచ్చేందుకు ఇక్కడి ప్రభుత్వం అనుమతిస్తుందా..? లేదా..? అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. పాక్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై గతేడాది నుంచి ఆందోలన వ్యక్తం చేస్తోంది. ఐసీసీకి కూడా ప్రత్యేకంగా లేఖ రాసింది. ఎట్టకేలకు పాక్ బోర్డు ఆశలు ఫలించాయి. పాక్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు ఆ దేశ ఆటగాళ్లందరికీ భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసింది.

అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20 కోసం భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది. దాయాది దేశం నుంచి ఆటగాళ్లు ఇక్కడికి ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేయనుంది. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు వెల్లడించినట్టు సమాచారం. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా సమస్య తీరిపోయింది. అయితే మ్యాచ్‌లు చూడడానికి అభిమానులు సరిహద్దులు దాటి వచ్చేందుకు అనుమతించడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దీన్ని త్వరలోనే పరిష్కారం అవుతుందని మేము ఐసీసీకి హామీ ఇచ్చాం’’ అని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు మీడియాకు వెల్లడించారు.

కాగా.. ఐసీసీ ఈ సమావేశంలో టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి మిగతా విషయాలపై కూడా చర్చించడం జరిగింది. పొట్టి ఫార్మాట్ నిర్వహించే వేదికలపై కూడా స్పష్టత ఇచ్చింది. మొత్తం తొమ్మిది వేదికల్లో టోర్నీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అహ్మదాబాద్‌‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన మ్యాచ్‌‌లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల, లక్నోలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: