కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు 191 దేశాల్లో విద్యా సంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది.
విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది. కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందనుందన్న ప్రకటన వెలువడగానే అనేక దేశాలు ఫిబ్రవరి 8వ తేదీ తరువాత మొదటగా విద్యాసంస్థలను మూసివేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితిని యునెస్కో మూడు రకాలుగా పరిగణనలోకి తీసుకుంది. అమెరికా వంటి దే శాల్లో చాలా రాష్ట్రాలు విద్యా సంవత్సరం చివరి వరకు స్కూళ్ల మూసివేతను తప్పనిసరి చేశాయి. ఏప్రిల్ 21వ తేదీ వరకు విద్యాసంస్థల మూతతో ప్రపం చ వ్యాప్తంగా 157 కోట్ల 96 లక్షల 34 వేల 506 మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని యునెస్కో వెల్లడించింది.