కరోనా వైరస్ కారణంగా దెబ్బతింటున్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శిస్తూనే స్థానికంగా పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన కీలక సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సన చర్యలపై చర్చించారు. ఆర్థిక, హోం, వాణిజ్య, పరిశ్రమల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో భారతదేశంలోకి పెట్టుబడులను ఫాస్ట్ ట్రాక్ మోడ్లోకి తీసుకురావడానికి, భారత దేశీయ రంగాలను ప్రోత్సహించడానికి అవసరమైన వ్యూహాలపై ప్రధాని చర్చించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక భూములు, ప్లాట్లు, ఎస్టేట్లలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించడానికి ఒక పథకాన్ని అభివృద్ధి చేయాలని మోడీ సూచించారు.
ప్రధానంగా పెట్టుబడిదారులను ఆకర్శించడం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, అవసరమైన వసతులను కల్పించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులను వేగంగా ఇవ్వడానికి పకడ్బందీగా విధానాలను రూపొందించాలని అన్నారు. ఇదే సమయంలో దేశీయ రంగాలను ప్రోత్సహించడానికి కూడా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన సంస్కరణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, పెట్టుబడి, పారిశ్రామిక వృద్ధికి ఆటంకం కలిగించే అడ్డంకులను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు.