అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు సహకారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంతకముందు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయ, సహకారాలపై అనుబంధ అఫిడవిట్‌ను దాఖలు చేసిన నిమ్మగడ్డ నిధుల గురించే ప్రస్తావించారు. న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాయని.. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. అనుబంధ వ్యాజ్యంపై తాజా విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది డీవీ సీతారామమూర్తి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్‌ సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని ప్రస్తావించడంతో న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ స్పందిస్తూ.. సహాయ, సహకారాల కోసం పిటిషన్‌ వేసి, ఈ కేసుల గురించి ఎందుకు చెబుతున్నారని, ఈ వ్యాజ్యంలో అవి అవసరమా అని ప్రశ్నించారు.

విచారణ సందర్భంగా పిటిషన్‌తోపాటు జత చేసిన పలు బిల్లులను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ ఏమిటని ప్రశ్నించారు. అవి న్యాయవాదులకు చెల్లించాల్సిన బిల్లులని సీతారామమూర్తి అన్నారు. ఆర్థికేతర సాయం అంటే ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సిబ్బంది ఖాళీల భర్తీ అని సీతారామమూర్తి అన్నారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కావాలా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అనుమతి అవసరమని, ఖాళీలను ప్రత్యక్ష పద్ధతిలో లేదా, డిప్యుటేషన్‌లో భర్తీ చేయొచ్చని సీతారామమూర్తి అన్నారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌కు ఏ రకమైన సహకారం కావాలో ప్రభుత్వాన్ని ఎన్నడూ కోరలేదని ప్రభుత్వ లాయర్ నివేదించారు. సిబ్బంది ఖాళీల భర్తీ విషయాన్ని కమిషనర్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదన్నారు. వివిధ సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చామని తెలిపారు.

ఈ సమయంలో ఎన్నికల కమిషనర్‌ వ్యక్తిగత సిబ్బంది అంశం ప్రస్తావనకు వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్‌కు హైదరాబాద్‌లో అధికార నివాసం ఉన్న విషయం కూడా న్యాయమూర్తి దృష్టికిరాగా.. దీనిపై జస్టిస్‌ దేవానంద్‌ ఎన్నికల కమిషనర్‌ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉండటం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం అంటే ఎంత ఖర్చు అవుతున్నట్లని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదంతా ప్రజాధనమని గుర్తు చేశారు. ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కోవిడ్‌ 19 పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని జగన్ సర్కార్‌ తేల్చి చెప్పింది. తాడేపల్లిలో స్టేట్ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సీఎం వైఎస్‌ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందని తెలిపారు. నవంబర్‌ నెలలో కోవిడ్‌ కేసులు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని

మరింత సమాచారం తెలుసుకోండి: