ఏపీలో రోడ్లు బాగా లేవన్న టాక్ బాగా విస్తరించింది. చివరకు పక్క రాష్ట్రం మంత్రులు కూడా ఏపీ రోడ్ల గురించి సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సీఎం జగన్ రోడ్ల సమస్యపై దృష్టి పెట్టినట్టున్నారు. దండిగా నిధులు విడుదల చేసి.. రోడ్ల సంగతి చూడమని ఆదేశించినట్టున్నారు. మరో ఆరు నెలల్లో ఏపీలో రోడ్లు అదిరిపోతాయంట. త్వరలో మార్కెటింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు నిర్మించేందుకు రూ.1,079 కోట్లు కేటాయించామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
ఈ వెయ్యి కోట్లకు పైగా నిధులతో గ్రామాల్లో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేస్తానని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అంటున్నారు. మరో ఆరు నెలల్లో పంచాయతీరాజ్ రోడ్ల స్వరూపం మార్చేస్తానంటున్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.28 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని నెల్లూరు జిల్లా పర్యటనలో తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో రూ.300 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లను పూర్తి చేశామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అంటున్నారు.
సీఎం అండదండలతో తనకు కేటాయించిన శాఖలకు వన్నె తేస్తానంటున్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. రైతుల సంక్షేమానికి పాటు పడతానని.. రైతులకు వచ్చే నెలలో 3 వేల ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు సబ్సిడీతో అందజేస్తామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పొదలకూరులో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సభాస్థలి పంచాయతీ బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఎన్ని జన్మలెత్తినా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనన్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.. తన రాజకీయ గురువు తన తండ్రి కాకాణి రమణారెడ్డి అని.. రాజకీయ భిక్ష పెట్టింది మాత్రం సర్వేపల్లి ప్రజలేనని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు.