ఇకపోతే ఇప్పుడు భాగ్యనగరం లో నివసించే కొందరు ముస్లింలకు తెలుగు కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జమాతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ సాదతుల్లా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాచీన భాష అయిన తెలుగు వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలుగు రాయడం, మాట్లాడటం ప్రతీ ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపు నిచ్చారు..శుక్రవారం ఛత్తాబజార్ లోని జమాతె ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యాలయంలో 'తెలుగు వర్ణమాల', 'భాషణ' పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న జమాతె ఇస్లామీ హింద్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జమాతె కార్యదర్శి ఖాలిద్ ముబష్షిర్, కోర్సు కోఆర్డినేటర్ అబ్దుల్ వాహెద్ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా తాము నిర్వహిస్తున్న తెలుగు కోర్సులకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ముస్లిం ల కోసం తాము ప్రచురిస్తున్న పుస్తకాలకు మంచి స్పందన వస్తోందనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. తెలుగు ప్రజలకు మనకు మంచి అనుబంధం ఏర్పడింది.. వారితో మాట్లాడాలంటే తెలుగు పై ప్రావీణ్యం ఉండాలని కోరారు..