ఈ కేసులలో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. పెద్దలు పరువు ప్రతిష్టలు అంటారు, పిల్లలు ప్రేమ నమ్మకం స్వతంత్రం లాంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. డబ్బు వెదజల్లడం వలన ఈ కేసులలో అధికారులు కూడా చొరబడుతున్నారు. కేసులను తారుమారు చేయడానికి వారి మద్దతు అవసరం కూడా. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక పరువు హత్యలో అక్కడి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ హత్యలో పాల్గొన్న దాదాపు 12 మందికి కఠిన కారాగార శిక్ష విధించింది. ఇందులో రెండు వైపులా కుటుంబాలు సహా రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ లకు శిక్షలు విధించింది న్యాయస్థానం.
వివరాలలోకి వెళితే తమిళనాడులోని రెండు సామజిక వర్గాలకు చెందిన జంట ప్రేమలో పడింది. కానీ వారి కులాలు వేరు కాబట్టి పెద్దలు ఒప్పుకోరు అని అర్ధం అయ్యింది. ఇళ్లు విడిచి వెళ్లారు, రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియకుండా కొన్నాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కువ కాలం ఇలా ఉండలేమని బయటకు వెళ్ళిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలి అని భావించారు. తాత్కాలికంగా తెలిసిన వారి ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు వెళ్ళిపోయినట్టు పెద్దలు కనిపెట్టారు. వాళ్ళను కనిపెట్టి అంతమొందించాలని రెండు కుటుంబాలు కలిసి ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళను మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువచ్చి సమయం చూసి విషం ఇచ్చి చంపి స్మశానంలో కాల్చేశారు. అన్ని తెలిసినా అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారు. కానీ స్థానిక మీడియా కల్పించుకోవడంతో తాత్కాలికంగా కేసు నమోదు చేసినట్టు సీన్ చేశారు. దీనితో కేసు నీరుగారిపోతుందని సిబిఐ కి అప్పగించాలని పట్టు రావడంతో ఆ పని జరిగింది. సిబిఐ 15మందిని దోషులుగా కనిపెట్టింది. దానితో కోర్టు కఠిన శిక్షలు విధించింది.