చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా )లోని పలు నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు మాజీ ఆలిండియా సర్వీసెస్ అధికారులు, ఐపీఎస్ ఐఆర్ఎస్ సహా పలువురు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి  నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉపాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బదులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అసమ్మతి వాదులను అణిచి వేయడానికి ఉపా చట్టాన్ని వాడుతున్నారని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ తెలిపారు. ఉగ్రవాదులనే ఆరోపణలతో అరెస్టయిన వ్యక్తుల హక్కులకు రక్షణ లేకుండా పోతుందని వెల్లడించారు. ఉపా కింద అరెస్టు చేసిన వారిని నేరస్థులుగా నిరూపించే విషయంలో అధిక కేసుల్లో ప్రాసిక్యూషన్ విఫలమైనందని పేర్కొంది.ఇష్టారాజ్యంగా ఉపాను ఉపయోగించడాన్ని ఆపాలని రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.

 ఇటీవల త్రిపుర లో చోటుచేసుకున్న హింసను నివేదించిన జర్నలిస్టులు, నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మొత్తం 102 మంది పై ఉపా కింద కేసు నమోదు చేశారు. ఇది సుప్రీం కోర్టుకు చేరింది, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ లో పాక్ -భారత్ మ్యాచ్ నేపథ్యంలో రెండు మెడికల్ కాలేజీ విద్యార్థుల పై ఉపా కింద అభియోగాలు మోపబడ్డాయి.2018లో పూణే సమీపంలోని ఓ గ్రామం లో చోటుచేసుకున్న హింసకు కుట్ర పన్నారనే ఆరోపణలతో 14 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు మహారాష్ట్రలోని జైల్లో నిర్బంధంలో ఉన్నారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన గిరిజన హక్కుల కార్యకర్త స్థాన్ స్వామి కి ఆరోగ్యం బాగోలేకపోయినా బెయిల్ లభించకపోవడంతో ఈ ఏడాది జూలైలో కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. అలాగే తీవ్ర అనారోగ్యానికి గురైన తర్వాత విరసం నేత వరవరరావు వైద్య కారణాలతో బెయిల్ మంజూరైంది. ఉపా కేసు ఆరోపణలు మోపబడిన వారిలో దోషులుగా తేలింది చాలా తక్కువ మంది ఉన్నారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: