ఇటీవల పలు సర్వేలు ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే అధికారం దక్కుతుందని, కానీ 2019 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు ఇప్పుడు రావని చెప్పారు. అలాగే వైసీపీలో దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని సర్వే చెప్పింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కూడా ప్రజా వ్యతిరేకత చాలా ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన ఓడిపోవడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అసలు పామర్రు అంటే వైసీపీకి కంచుకోట...గత రెండు పర్యాయాలు నుంచి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుంది. పైగా ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ వరుసగా రెండుసార్లు గెలిచేసింది. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ దాదాపు 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో టి‌డి‌పి అభ్యర్ధి ఉప్పులేటి కల్పనపై విజయం సాధించారు.


అయితే ఎమ్మెల్యేగా అనిల్ అంత అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తప్ప పామర్రులో కొత్తగా జరిగే కార్యక్రమాలు లేవు. పైగా పామర్రులో రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది. అటు ఇసుక, ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతల అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగినట్లు సర్వేలు చెప్పాయి.


కానీ వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో కల్పన ఉన్నారు. ఆమె పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు. దీంతో నెగిటివ్ ఉన్న ఎమ్మెల్యేకి టి‌డి‌పి వీక్ గా ఉండటమే పాజిటివ్ అవుతుంది. పైగా తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో పామర్రులో వైసీపీ సత్తా చాటింది. మొత్తం జెడ్‌పి‌టి‌సి స్థానాలని గెలుచుకున్న వైసీపీ..66 ఎం‌పి‌టి‌సిలకు గానూ 58 గెలుచుకుంది. టి‌డి‌పి 5 గెలుచుకోగా, జనసేన 2, ఇతరులు 1 గెలుచుకున్నారు. అంటే టి‌డి‌పి ఎంత వీక్ గా ఉందో అర్ధమవుతుంది. టి‌డి‌పినే ఎమ్మెల్యేకు ప్లస్ అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: