కుప్పం లాంటి చోట చంద్రబాబు పరాజయాన్ని పరిపూర్ణం చేశాక వైసీపీ హాయిగా ఉండాలి. అదే టైమ్ లో భవిష్యత్తు మీద బెంగ పడి తమ్ముళ్ళు కకావికలం కావాలి. కానీ వైసీపీ వ్యూహాలు లేక దూకుడుతో చేసుకున్నదాని ఫలితంగా ఇపుడు చంద్రబాబుకు జనంలో ఒక్కసారిగా సింపతీ పెరిగిపోయింది. ఆయన కంట కన్నీరు మొత్తం సీన్ ని మార్చేసింది. ఏపీలో ఇపుడు ఏ వైపు చూసుకున్నా దాని మీదనే చర్చ.
ఇక జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశం అవుతోంది. అదే టైమ్ లో ఇరుగు పొరుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మద్దతు బాబుకు దక్కుతోంది. సినీ నటులు రజనీకాంత్ నుంచి సోనూ సూద్ వంటి వారు అంతా బాబుకు సానుభూతి ప్రకటిస్తున్నారు కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో ఎందుకిలా బొమ్మ తిరగబడింది అంటే దాని మీద వైసీపీలో అంతర్మధనం సాగుతోంది. వైసీపీలో కొందరు నేతలు తమ దూకుడుతో టీడీపీకి ఆక్సిజన్ అందిస్తున్నారు అన్న మాట కూడా ఉంది.
వారే కోవర్టులు మాదిరిగా ఉన్నారు అన్న విమర్శలు వస్తున్నాయిట. వైసీపీలో కొందరు నాయకులు నోటి దురుసుతనం వల్ల వైసీపీ పాజిటివిటీ అంతా దెబ్బకు తారు మారు అవుతోంది అంటున్నారు. వారు కావాలని చేస్తున్నారా లేక మరే కారణాలు ఉన్నాయా అన్న చర్చ కూడా ఉందిట. ఏపీలో టీడీపీ పని అయిపోయింది అనుకున్న వేళ కొందరు వైసీపీ నాయకుల పోకడల వల్లనే ఇలా జరుగుతోంది అన్న మాట అయితే పార్టీ వర్గాల్లో ఉందని టాక్. వారంతా కూడా మధనపడుతున్నారని తెలుస్తోంది.
జగన్ వెంట మొదటి నుంచి నడచిన వారిలో ఎక్కువ మంది యాంటీ టీడీపీ జనాలే ఉన్నారు. వారు ఎపుడూ కూడా వ్యూహాలు లేకుండా నోటికి పని చెప్పిన ఘటనలు లేవు. వారు ఏది మాట్లాడినా కూడా పార్టీకి డ్యామేజిగా ఉండదు. కానీ కొందరు మాత్రం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుంటున్నారు. దాని వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి వైసీపీ అధినాయకత్వం దీని మీద చర్చించి ఇక మీదట అలాంటి వారిని అదుపులో ఉండమని చెప్పాలని కూడా సూచనలు అందుతున్నాయిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.