అధికారపార్టీ ఎంఎల్ఏల్లో కొందరు పక్కపార్టీల వైపు చూస్తున్నారా ? పార్టీవర్గాలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా  అవుననే సమాదానం ఇస్తున్నాయి. వచ్చేఎన్నికల్లో  సుమారు 35 మంది ఎంఎల్ఏలకు వివిధ కారణాలతో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరనే ప్రచారం అందరికీ తెలిసిందే. గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేవారికే టికెట్లు ఇస్తానని సమావేశంలోనే ప్రకటించారు.





ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారనే విషయమై ఇఫ్పటికి మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. మూడుసమీక్షల్లో కూడా మంత్రులు, ఎంఎల్ఏలు కలిపి సుమారు 35 మంది సరిగా పాల్గొనటంలేదని తేలింది. కార్యక్రమాల్లో పాల్గొనని వాళ్ళ జాబితాను జగన్ చదివి వినిపించినా వారిలో పెద్దగా మార్పురాలేదు. అంటే తమకు ఎలాగూ టికెట్లు దక్కవు అని వాళ్ళంతా డిసైడ్ అయిపోయినట్లున్నారు. ఎలాగూ టికెట్లు దక్కనపుడు ఇక కార్యక్రమంలో పాల్గొనటం కూడా ఎందుకని తీర్మానించుకున్నట్లున్నారు.





ఇలాంటివారిలో కొందరు ఎంఎల్ఏలు టీడీపీ, జనసేన నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు జగన్ దృష్టికి వచ్చిందట. ఇదే సమయంలో వివిధ అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలను కూడా పిలిపించి మాట్లాడాలని జగన్ అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈమధ్యనే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డితో జగన్ భేటీఅయ్యారు. ఇక పక్కచూపులు చూస్తున్న ఎంఎల్ఏలను కూడా పిలిపించుకుని విషయం ఏమిటో కనుక్కోవాలని జగన్ అనుకున్నారట. వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఉండేది డౌటంటున్నారు.





ఏ కారణంవల్ల టికెట్ ఇవ్వలేకపోయినా బాధపడాల్సిన అవసరంలేదని ఏదోరకంగా వేరేపదవిలో సర్దుబాటు చేస్తానని నచ్చచెప్పేందుకు జగన్ రెడీ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. మరి జగన్ హామీతో పక్కచూపులు చూస్తున్న ఎంఎల్ఏలు సర్దుకుంటారా లేకపోతే టికెట్లు ఖాయంచేసుకుని పక్కపార్టీల్లోకి జంప్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ, జనసేనే కాదు కొత్తగా బీఆర్ఎస్ రూపంలో ఎంఎల్ఏలు, నేతలకు చాయిస్ పెరుగుతోంది. మరి జగన్ బుజ్జగింపులు లేదా వార్నింగులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: