జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో ఒక సమస్యుంది. అదేమిటంటే తనకు తెలీదు ఇంకోళ్ళు చెబితే వినరు. ఈ గుణం కారణంగానే జనాల్లో నవ్వులపాలవుతున్నారు. అధికార వైసీపీ నేతలకు రెగ్యులర్ గా టార్గెట్ అవుతున్నారు. పవన్ గురించి మంత్రులు, వైసీపీ నేతలు తరచూ రెండుమాటలు చెబుతుంటారు. అవేమిటంటే మొదటిది ప్యాకేజీ స్టార్ అని, రెండోది చంద్రబాబునాయుడు పల్లకిని మోస్తున్నారని.





రెండింటిలో ఏది కరెక్టు ? ఏది తప్పు ? లేకపోతే రెండూ తప్పేనా ? అన్నది పవన్ మాత్రమే చెప్పాలి. అయితే పై రెండు విషయాల్లో మొదటినుండి పవన్ మాటలు ఒకలాగుంటే చేతలు మరోలాగుంటున్నాయి. అందుకనే జనాలు పవన్ మాటలను నమ్మటంలేదు. తాజాగా మంత్రులు, నేతలు తనను చంద్రబాబు పల్లకీ మోస్తున్నారనే విషయంలో పవన్ కు బాగా మండినట్లుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన ట్విట్టర్లో ఒక కార్టూన్ వేశారు. అందులో ఏముందంటే జగన్ పల్లకిలో కూర్చునుంటే మంత్రులు, అధికారులు పల్లకిని మోస్తున్నారు.





అంటే జగన్ ఎక్కిన పల్లకిని మంత్రులు, అధికారులు మోస్తున్నారని కార్టూన్ వేయటం ద్వారా పవన్ తనలోని అక్కసును తీర్చుకున్నారని అనుకోవాలి. అయితే ఇక్కడే పవన్ తనలోని అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఎలాగంటే పవన్ చంద్రబాబు పల్లకీని మోయటం వేరు, మంత్రులు, అధికారులు జగన్ పల్లకీని మోయటంవేరు.





ముఖ్యమంత్రి కాబట్టి మంత్రులు, ఎంఎల్ఏలు, అధికారులు జగన్ పల్లకీని మోయటంలో తప్పేముంది ? ముఖ్యమంత్రి ఎక్కిన పల్లకీని మంత్రులు, ఎంఎల్ఏలు మోయకపోతే 1995లో ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ రిపీట్ అయినట్లే అవుతుంది. కాబట్టి పల్లకినీ మోయటం తప్పేకాదు. ఇదే సమయంలో టీడీపీ ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలు చంద్రబాబు పల్లకీని మోయటంలో కూడా తప్పులేదు. అయితే జనసేనకు అధినేతగా ఉండి టీడీపీ అధినేత చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ తప్పు. దాన్నే మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే ఎత్తిచూపుతున్నారు. దాన్ని అర్ధంచేసుకోలేని అజ్ఙానంలో ఉండిపోయారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: