తెలంగాణాలో మంత్రులు... ఇప్పుడు భయం భయంగా ఉన్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా బలపడే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందనే ప్రచారం కొన్ని రోజులుగా ఎక్కువగానే జరుగుతుంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో ఉన్న కెసిఆర్ బలాల మీద ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే కెసిఆర్ సన్నిహితుల మీద దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. మరి కొందరు మంత్రులు అక్రమాస్తులు పోగేసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల్లో సైతం కొందరు మంత్రులు టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. ఎన్నికల ఫలితాలను బట్టి ఇక్కడ అక్రమాస్తులు కూడ బెట్టుకుంటోన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఐటీ దాడులతో టార్గెట్ చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో చాలా మంది గత ఎన్నికలకు ఎన్నికలకు భారీగా ఖర్చు పెట్టారని, తెలంగాణా ఉద్యమంలో కూడా వారు బాగా లాభ పడ్డారని ఐటి శాఖకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తుంది. దీనితో వారి మీద దాడులు చేసేందుకు గాను ఐటి శాఖ సిద్దమైందని అంటున్నారు. ఇక అక్రమాస్తులు కూడ బెట్టుకుంటోన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు కెసీఆర్ ఇప్పటికే జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి.
అటు బీజేపీ తెలంగాణలో ఎలాగైనా అధికారంలో రావాలన్న టార్గెట్ తో ఇప్పటి నుంచే చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం అధికార పార్టీ నేతలను ఎలాగైనా బెదిరించి కొంత వరకు అయినా తమ వైపునకు తిప్పుకునేందుకు కూడా ఆ పార్టీ వెనుకాడని పరిస్థితి ఉంది. అటు బీజేపీ గట్టిగా టార్గెట్ చేయడంతో పాటు ఇటు మునిసిపోల్స్లో కేసీఆర్, కేటీఆర్ తమకు ఇచ్చిన టార్గెట్లు చేరుకోలేక పోయినా, తమ స్థానాల్లో ఫలితాలు కాస్త అటూ ఇటూ అయినా చాలా మంది మంత్రులను నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణ మంత్రులు భయం భయంగా ఉంటున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.