దేశంలో కరోనా వైరస్ కేసులు మొదలయ్యాయో అప్పటి నుంచి మద్యం షాపులు మూసివేశారు. వాటితో పాటు బార్లు, క్లబ్లులు అన్నీ మూసివేశారు. దాంతో మద్యానికి అలవాటైన మందుబాబుల కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడా మద్యం లభించకపోవడంతో పిచ్చిపట్టిన వారిలా ప్రవర్తించడం మొదల పెట్టారు. కాస్త డబ్బున్న వారు బ్లాక్ లో కొంటున్నారు.. కానీ అది కూడా లభ్యమవుతుందా లేదా అన్న విషయం తెలియదు. మరికొంత మంది ఆన్ లైన్ లో ఆర్డర్ వేయడం మొదలు పెట్టారు. మరికొన్ని చోట్ల మద్యం షాపులకు కన్నం వేయడం మొదలు పెట్టారు. అయితే ఈ సమయంలో మద్యం అమ్మి మంచి క్యాష్ చేసుకోవొచ్చు అని భావించాడు ఓ యువకుడు. ఈ క్రమంలో ఓ యువకుడు బంపర్ ప్లాన్ వేశాడు.
చచ్చినా పోలీసులకు అనుమానం రాదని భావించి శ్మశానంలో మందు దుకాణం పెట్టాడు... తూప్రాన్కు చెందిన రవి అనే యువకుడు. మెదక్ జిల్లా తూప్రాన్లో ఈ ఘటన వెలుగుచూసింది. శ్మశానంలో ఉన్న ఓ చిన్న రేకుల షెడ్డుల్లో రహస్యంగా మద్యం విక్రయిస్తున్నాడు. ఎవరైనా మద్యం కావాలని అడిగితే అక్కడికి రావాలని చెప్పేవాడు. అక్కడికి వచ్చేవారికి మద్యం ఇవ్వడంతో కొందరు శ్మశానంలోనే కూర్చుని మందు తాగి వెళ్లేవారు. ఇలా మనోడి బిజినెస్ ఆరు కోటర్లు.. పన్నెండు బీర్లు అన్నట్లు సాగింది. అయితే ఇలాంటి దొంగ వ్యవహారాలు ఎక్కడో అక్కడ లీక్ అవుతుంటాయి.. ఇదే జరిగింది. మనోడి స్మాశాన మందు వ్యాపారం కాస్త లీక్ అయ్యింది.
శుక్రవారం ఉదయం పోలీసులు అక్కడికి వెళ్లగా.. రవి అప్పటికే అక్కడినుంచి పారిపోయాడు. ఆ రేకుల షెడ్డులో ఏకంగా లక్ష రూపాయల విలువైన మద్యం లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. అయితే అక్కడ 180 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.