నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్ అవుతుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్స్ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
గతంలో రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, ఆ పరిస్థితి పూర్తిగా మారాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని అన్నారు.
వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు సీఎం జగన్కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వెల్లడించారు. సమగ్ర భూ సర్వే 3 దశల్లో కొనసాగుతుందని. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సర్వే ఉంటుందని తెలిపారు.