ఏపి సీఎం జగన్ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు.రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు ఇవాల్టి నుంచి అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెంటనే వెయ్యి టన్నుల ఉల్లిని మార్కెట్ లోకి తీసుకువస్తామని తెలిపారు. మొదటగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ అందిస్తామన్నారు. భారీ వర్షాలతో కర్నూలు ఇతర ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఈసారి 25 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు పేర్కొన్నారు.
తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి 1500 నుంచి 2000 క్వింటాల ఉల్లి మార్కెట్ కు రానుందని సమాచారం అందించారు. మహారాష్ట్ర వంటి నగరాల్లో ఉల్లి సాగు బాగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరస్థితుల్లో ప్రధాన నగరాల్లోని రైతు బజార్లలో 40 రూపాయలకే కొనుగోలు చేసేలా అన్నీ చర్యలు తీసుకుంటామని జగన్ సర్కార్ వెల్లడించారు.గతంలో కూడా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీ ధరలకు అందించామని గుర్తు చేశారు. రైతుల మేలు కోసం ఎంత ప్రయత్నిస్తామో , ప్రజల ప్రయోజనాలు అంతే ముఖ్యమని అన్నారు.