జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు నారా లోకేశ్ ఖండించారు. జాతీయ రాజకీయాలకే వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్ మరియు పీవీ లాంటి మహనీయులను రచ్చకీడుస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేశారని గుర్తుచేశారు. సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పీవీ పరుగులు పెట్టించారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, పీవీపై చేసిన వ్యాఖ్యలు తెలుగు వారందరినీ అవమానించడమేనని చంద్రబాబు అన్నారు.

‘‘తెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగువెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావులు. దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే...ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ. ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు. అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమే.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులు కూలుస్తానని అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ఘాటుగా స్పందించారు. గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చే బదులు.. మీలో ఉన్న అహాన్ని కూలిస్తే మీకు ఓట్లేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుందని లోకేశ్ ట్వీట్ చేశారు.


ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చేస్తామంటూ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు మండిపడ్డారు.





మరింత సమాచారం తెలుసుకోండి: