పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎలాగైనా ముందుకు నడిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం కానీ, మరో పార్టీలో విలీనం చేయడంగాని చేయబోనని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. పార్టీని నడిపేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
పార్టీని బలోపేతం చేయడానికి వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నాడు పవన్. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలను బయటకు వెళ్లకుండా చూసుకోవడానికి చేసే ప్రయత్నం ఒకటి కాగా, నేతలను కాపాడుకుంటూ.. కార్యకర్తలను పెంచుకోవడం. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటె, పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తుంటే.. పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నది.
ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి అనుకోవడమే ఇందుకు ఒక కారణం కావొచ్చు. మరో విధంగా చెప్పాలి అంటే.. పార్టీ కోసం పవన్ తన తుది శ్వాస వరకు పోరాటం చేస్తానని అన్నారు. ఇది పవన్ కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇలా ప్రజల్లోకి వెళ్లడం వలన కొన్ని పార్టీలకు ఇబ్బందులు రావొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా ఆ పార్టీ నేతలు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు.
అంతేకాదు, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వలనే పార్టీ ఓటమి పాలైంది. వైకాపా విజయం సాధించడానికి ఒక కారణం కూడా ఇదే. అందుకే ఎలాగైనా పార్టీని బలోపేతం చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. మరో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, కనీసం కొంతమేరకైనా ప్రభావం చూపించాలని పార్టీ భావిస్తోంది. మరి ఇది సాధ్యం అవుతుందా చూద్దాం.