భారత్లో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రకారం దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 17,615కు చేరుకుంది. ఇప్పటివరకు 556కు మంది కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సుమారు నాలుగువేలకు చేరువలో కొవిడ్-19 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోరా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్డౌన్ అమలులో ఎలాంటి సడలింపులు లేవంటూ ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అడుగుముందుకు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏకంగా మే 7వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 164,784కు చేరింది. 2.4 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.