ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో విఫలమయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యోగేశ్​పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణకూ రాష్ట్రపతి ఆదేశించారు.వర్సిటీలో అధికారం కోసం వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ పారదర్శకంగా సాగేందుకు త్యాగిని సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. సస్పెన్షన్​ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.


అయితే, నిబంధనలకు అనుగుణంగా త్యాగి తన విధులను నిర్వహించలేదని ఓ అధికారి వెల్లడించారు. ఇది విశ్వవిద్యాలయ పాలనపై ప్రభావం చూపిందన్నారు. త్యాగి గైర్హాజరు లేదా మెడికల్ లీవ్​లో ఉన్న సమయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా జులై 2న త్యాగి.. ఎయిమ్స్​లో చేరారు. ఆయన తిరిగి విధుల్లో చేరేవరకు త్యాగి బాధ్యతలను పీసీ జోషికి అప్పగిస్తూ జులై 17న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, గతవారంలో జోషిని తొలగించి.. ఆయన స్థానంలో గీతా భట్​ను నియమిస్తూ త్యాగి ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదానికి దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: