చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇమేజ్ తెచ్చే పాత్రల కోసం చూడడం లేదు. సగటు కుర్రాడిని తలపించే పాత్రలే ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. మొదటి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే క్రిష్తో సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం కమర్షియల్ సినిమాలా కాకుండా ఆర్ట్ ఫిలిం తరహాలో వుంటుందని అంటున్నారు. ఇక తాజాగా పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబా జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు తర్వాత భారీ వర్షాలు ఉన్నప్పటికీ వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ కొనసాగించారు క్రిష్. డ్రగ్స్ కేసులో రకుల్ ముంబై వెళ్లాల్సి వచ్చినా చిత్రీకరణ ఆగలేదు.
నలభై రోజులు అనుకున్న షెడ్యూల్ 35 రోజుల్లో పూర్తి కావడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. శుక్రవారంతో ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నటీ నటులు, టెక్నీషియన్స్ సహకారంతోనే తక్కువ సమయంలో షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు చెబుతున్నారు.బ్యాలెన్స్ ఉన్న పాటను త్వరలో తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి...ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నాడు క్రిష్...!!