కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలు అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఓవైపు ఉపాధి లేకపోవడం మరోవైపు లాక్ డౌన్ కష్టాలతో సమస్యలు పాలవుతున్నారు. ఇలాంటి సమయంలో పేద వర్గాలకు మేలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పొట్ట కూటి కోసం విదేశాలకు వలస వెళ్లిన వారి కోసం ఆయన కేంద్రానికి కీలక ప్రతిపాదన పెట్టారు. కువైట్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్కు ఏపీ సీఎం లేఖ రాశారు.
వలస కార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ``విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్’ మిషన్ పేరుతో మీరు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది భారతీయులు వందే భారత్ మిషన్ను సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అదే కోవలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరు. కువైట్లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి రావడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలు చెల్లించలేని స్ధితిలో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ రుసుము మాఫీ చేయడంతో ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్రానికి చెందిన వలస కూలీలు ఇండియాకు వచ్చేందుకు ప్రయాణఖర్చు భరించడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున మీరు వెంటనే కువైట్ హైకమిషనర్కు సూచించి, అక్కడి అధికారులతో మాట్లాడి కువైట్ నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. `` అని సీఎం జగన్ ప్రతిపాదించారు.
వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ``జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారికోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అందువల్ల కువైట్తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలస కార్మికులను వీలైనంత త్వరగా దశల వారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం.`` అని లేఖలో సీఎం జగన్ వెల్లడించారు.