భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలో పరిస్థితి చాలా  దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆయన సూచించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో ఆయన చర్చించారు.

హైదరాబాద్ నగరంలో గత వందేళ్లకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి అని అన్నారు. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది అని చెప్పుకొచ్చారు. నగరంలోని వరద నీటితో పాటు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు హైదరాబాద్ నగరంలోని చెరువులకు చేరిందన్నారు. నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని ఆయన తెలిపారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందని అన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు, చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండి పండడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న చెరువులను గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. ఎక్కడైనా గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే రంగంలోకి దిగి మరమ్మత్తులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. చెరువు కట్టలు తెగే అవకాశం ఉన్న చోట, గండ్లు పడే అవకాశం ఉన్న చోట వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రజలను అప్రమత్తం చేయాలని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: