కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. అగ్రరాజ్యాన్ని ఊపిరితీసుకోనివ్వకుండా చేస్తోంది. దవాఖానలన్నీ కూడా కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. ఎటుచూసినా శవాలే కనిపిస్తున్నాయంటూ అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కో రోజు వెయ్యిమందికిపైగా మృతి చెందుతున్నారు. తాజాగా.. అమెరికాలో కరోనా వైరస్తో మృతి చెందిన వారి సంఖ్య 17వేలకు చేరువలో ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా నాలుగున్నర లక్షలకుపైగా ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లోనే మరణాల సంఖ్య సుమారు 9వేలు ఉండడం గమనార్హం. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిణామాలతో అమెరికా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
కరోనాతో వృద్ధులేకాదు.. యువతీయువకులు కూడా మృతి చెందుతున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ దారుణమైన పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు చేపడుతున్నారు. కానీ.. ఇప్పటివరకు కరోనాపై పైచేయి సాధించలేకపోతున్నారు. మరోవైపు కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోంది. కేవలం మూడు వారాల్లోనే 16 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోయారు. ముందుముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చైనాపై, ప్రపంచ ఆరోగ్య సంస్థపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరివల్లే నేడు ప్రపంచం ఆగమాగం అవుతోందని. ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.