కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు చేరవేస్తున్నది. ఇందులో భాగంగా చేపట్టిన వందే భారత్ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నది. అయితే రెండో విడత వందే భారత్ను మే 15 నుంచి ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ దఫా రష్యా, ఉక్రెయిన్, థాయ్లాండ్, స్పెయిన్, జర్మనీ, సీఐఎస్ దేశాలైన అర్మేనియా, అజర్బైజన్, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, మాల్దోవా, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్లలో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఇక మొదటి విడత వందే భారత్ కార్యక్రమం మే 7 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అమెరికా, యూకే, బంగ్లాదేశ్, సింగపూర్, సౌదీ అరేబియా, కువైట్, ఫిలిప్పీన్స్, యూఏఈ, మలేషియాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల్లో కేంద్రప్రభుత్వం ఇప్పటికే తరలిస్తున్న విషయం తెలిసిందే. రెండు మార్గాల్లో భారతీయులను తీసుకొస్తోంది. విమానాలతోపాటు భారీ షిప్లలో వివిధ దేశాల నుంచి భారతీయులను ఇండియాకు తీసుకొస్తోంది.