ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి వల్ల అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ తర్వాత ఈ మద్య రష్యా లోకూడా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు మరణాలు అమెరికాలోనే సంబవించాయి. అంటే ఇక్కడ కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తాజాగా కరోనా దెబ్బకు సింగపూర్ విలవిల్లాడుతోంది. ఆ దేశంలో భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క రోజే కొత్తగా 753 మంది కరోనా బారిన పడ్డారు. మొన్నటి వరకు పెద్దగా కరోనాతాకిడి లేకున్నా ఇప్పుడు సింగపూర్ మిగతా దేశాల బాట పట్టింది.
దీంతో, ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 22,460కి చేరుకుంది. వారిలో ఇప్పటి దాకా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,040 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్త కేసుల్లో అత్యధికమంది వసతి గృహాల్లో నివసించే వలస కార్మికులేనని ప్రభుత్వం తెలిపింది. 9 మంది మాత్రం శాశ్వత నివాసులని పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు