తెలంగాణ సర్కార్ పదో తరగతి పరీక్షల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్గా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ నివేదించారు. ఈ నెల 8 వ తేదీ నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయొచ్చని అన్నారు.
ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే గుర్తిస్తామని తెలిపారు. విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ చిత్ర రామచంద్రన్, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. అయితే పిటిషనర్ విద్యార్థులకు పంజాబ్ తరహాలో గ్రేడింగ్ ఇవ్వాలని వాదించారు. దీంతో హైకోర్టు పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని... జీహెచ్ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వాన్ని అడిగి వివరాలు తెలియజేస్తానని చెప్పడంతో విచారణను 4 గంటలకు కోర్టు వాయిదా వేసింది.