అనారోగ్య కారణాలతో ఎవ్వరైనా మావోలు అడవిని వీడి వస్తుంటే పోలీసులు మరింత అప్రమత్తం అయిపోతున్నారు. వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, ఒడిశా, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలలో ఒకనాటి ప్రాబల్యం ఇప్పుడు తగ్గిపోయినా, కొన్ని సార్లు మాత్రం తమ మనుగడను చాటుకునే ప్రయత్నాలపై మావోలు శ్రద్ధ వహిస్తూనే ఉన్నారు. లొంగి పోయిన నక్సలైట్ల వల్ల ఉద్యమానికి వచ్చిన నష్టం ఏమీ లేదని, ప్రభుత్వం చేపట్టే ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉంటామని అంటున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ఎలా నిలువరించాలో తమకు తెలుసు అన్న భావనను గతంలో బలంగా వినిపించారు. అలానే తెలంగాణ వాకిట నల్లమల అడవులను జల్లెడ పట్టే పని మానుకోవాలనీ హెచ్చరించారు.
ఇవన్నీ మావోల ప్రాబల్యానికి సంబంధించినవి. ఒకప్పుడు ఉద్యమం. ఇప్పుడు ఉనికి మాత్రమే. ఇదే సందర్భంలో వీరులను అడ్డు పెట్టుకుని రాజకీయ శక్తులకూ మావోలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు మావోల ఊసు ఒకటి వినిపించింది. వెంటనే భద్రతా బలగాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పటిదాకా ఎటువంటి కవ్వింపు ధోరణులూ లేకపోయినా, ప్రమాదం పొంచి ఉందన్న భయం, ఆందోళన పోలీసుల్లో కనిపిస్తున్నాయి అని నక్సల్ సానుభూతి పరులు అంటున్నారు. తమ కోపం మోడీ కార్పొరేట్ శక్తుల అనుకూల నిర్ణయాలపైనా, కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపైనే అని మరో మారు చెప్పే ప్రయత్నం ఈ వారోత్స వాల ద్వారా చేయనున్నారని సమాచారం.
తెలంగాణ వాకిట మావోయిస్టుల వారోత్సవాలు సర్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమాల గడ్డపై వీరుల స్మరణ చేస్తూనే, భవిష్యత్ కార్యాచరణ అన్నవి చర్చకు రానున్నాయి. గత కొంతకాలంగా లొంగుబాట్లు తీవ్రతరం అవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ వారోత్సవాలు అత్యంత కీలకం అయ్యాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లొంగుబాటు చర్యలు పెరిగాయని వార్తలు వస్తున్నాయి. మరికొందరు సీనియర్లు కరోనా కారణంగా కూడా బయటకు వచ్చేస్తున్నారు. అడవి నుంచి బయటకు వచ్చి, జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ప్రభుత్వం రివార్డు అందిస్తుండడం, పునారావాసానికి హామీ ఇస్తుండడంతో పోలీసు ప్రకటనలు బాగానే పనిచేస్తున్నాయి. వారోత్సవాలు నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాల కూంబింగ్ జరుపుతున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులపై నిఘా కూడా పెంచారు. రాకపోకలపై సమాచారం ఆరా తీస్తున్నారు. మంచిర్యాల జిల్లా, కోటపల్లి,వేమనపల్లి మండలాల్లోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల పై నిఘా ఉంచారు. వారోత్సవాల సందర్భంగా సిబ్బంది తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షిస్తున్నారు.