ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు యువ నాయకుల అవసరం ఎంతైనా ఉంది. దీనిని గ్రహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువ నేతలకు అవకాశం ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించే సూచనలు కనపడుతున్నాయి. దీనికి సంబంధించి పార్టీలో ఇప్పటికే విభేదాలు కూడా మొదలయ్యాయి అని ప్రచారం జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడి తనయుడిగా రాజకీయాల్లోకి రావడంతో పాటు వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన గత యేడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఎంపీగా గెలిచి తన సత్తా ఫ్రూవ్ చేసుకున్నారు.
నిన్న మొన్నటి వరకు లోకేష్కు సైతం రామ్మోహన్ నాయుడికే పదవి ఇచ్చేందుకు ఇష్టంగా ఉండేదట. అయితే ఇప్పుడు ఎవరో కొందరు లోకేష్ సన్నిహితులు రామ్మోహన్ నాయుడికి పదవి ఇస్తే నిన్ను డామినేట్ చేస్తాడని చెప్పడంతో లోకేష్ తీరు మారిందంటున్నారు. ఆయనకు పదవి ఇవ్వడం లోకేష్ కి ఇష్టం లేదని సమాచారం. ఇక రామ్మోహన్ నాయుడు బాబాయి అచ్చెన్నాయుడు కూడా ఈ విషయంలో కాస్త అసహనంగా ఉన్నారు అని సమాచారం. ఇక గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఇదే విషయంలో ఆగ్రహంగా ఉన్నారట.
తాను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా అని తన తండ్రి కూడా పార్టీ కోసం కష్టపడ్డారు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోలేదు.. ఇక ఇప్పుడు కూడా గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి కొంత మంది సీనియర్ నేతలు కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్నారట. విశాఖ జిల్లాకు చెందిన ఒక యువనేత కూడా ఈ విషయంలో అసహనంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ వర్గాలు కూడా ఈ ప్రకటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.