కరోనా వైరస్.. ఈ పేరు వినియం ప్రజలకు కామన్ అయిపోయినా దీని భయం మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే.. అంతగా ఈ మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదట చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనాతి కాలంలోనే ప్రపంచదేశాలు వ్యాప్తిచెందింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇక భారత్లోనూ కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కరోనాను నివారించేందుకు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని సంస్థలతో పాటు విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. అయితే విశ్వసనీయ వర్గాలు సమాచారం మేరకు భారత్లోనూ స్కూళ్లు తెరిచాక కేంద్రం కొత్త రూల్స్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
మన స్కూళ్లలో తరగతి గదులు చిన్నగా ఉంటాయి. నలబై మంది పట్టే క్లాసులో ఇప్పుడు ఇరవై మందినే ఉంచాల్సి ఉంటుంది. ఇక టీచర్ల సంఖ్య కూడా తక్కువే. అందుకే ఉదయం, మధ్యాహ్నం వేళ కింద రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలనే కండీషన్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే సరిసంఖ్య ఉన్న విద్యార్థులు ఓ రోజు... బేసి సంఖ్య ఉన్న విద్యార్థులు మరో రోజు క్లాసులకు వచ్చేలా రూల్ తెచ్చే ఆలోచన కూడా ఉంది. అయితే స్కూల్కి రాని విద్యార్థులు ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసులు చదవాల్సి ఉంటుంది.
ఇక ఒకే సమయంలో కొందరు విద్యార్థులకు ఆన్లైన్ కొందరు విద్యార్థులకు ఆఫ్లైన్లో క్లాసులు నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఇది కూడా సరి బేసి విధానం లాంటిదే. ఏమన్నా డౌట్స్ ఉంటే నోట్ చేసుకుని ఆ తర్వాత రోజు స్కూల్కి వెళ్లినప్పుడు తీర్చుకోవచ్చు అంటున్నారు. అలాగే ప్రస్తుతం కొన్ని స్కూళ్లు వారానికి ఐదు రోజులే నడుస్తున్నాయి. కానీ కేంద్రం వారానికి ఆరు రోజులు స్కూల్ నడపాల్సిందే అనే కండీషన్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఆన్లైన్లో క్లాసులు నిర్వహించినా ఆరు రోజుల రూల్ తప్పనిసరి అంటున్నట్టు తెలుస్తోంది.