కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కొన్ని చివరి దశకు చేరుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచం గంపెడాశలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యత ఎవరికనే అంశంపై స్పందించారు. మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అత్యధిక ముప్పు ఉన్నవారికి, వయసు మళ్లిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని సౌమ్య స్యామినాథన్ స్పష్టం చేశారు. ఆరోగ్యవంతులైన యువతకు ఇప్పట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.


ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని యువతీయువకులు 2022 వరకు వేచి ఉండక తప్పదని వివరించారు. కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎన్నో సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. కోవిడ్-19పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని మెజార్టీ జనం అంగీకరిస్తున్నారన్నారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ కసరత్తులు చేస్తోందని వివరించారు. అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ 2021 నాటికి కనీసం ఒక్కటైనా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కరోనా వ్యాక్సిన్ డోసులు పరిమిత సంఖ్యలోనే లభ్యం కావొచ్చని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. మానవ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకు దుష్ప్రభావలు తలెత్తడంతో జాన్సన్ అండ్ జాన్సన్, ఎలి లిల్లీ టీకా ప్రయోగాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గత నెలలోనూ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా సైతం తాత్కాలికంగా నిలిచిపోగా.. తిరిగి ప్రారంభమయ్యాయి.


హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలనే ఆశతో వైరస్ వ్యాప్తి చెందడం అనైతికమని, అనవసరమైన మరణాలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్ఓ ఇంతకు ముందు వ్యాఖ్యానించింది. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
‘హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చర్చిస్తున్నారు..కానీ, టీకా వచ్చిన సందర్భంలో మాత్రమే దాని గురించి మాట్లాడాలి’ అని స్వామినాథన్ అన్నారు. మహమ్మారి వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి కనీసం కనీసం 70 శాతం మందికి టీకాలు వేయాలి అని అన్నారు. కరోనా వైరస్ మరణాల రేటు మళ్లీ పెరగడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు పెరగడంతో మరణాలు కూడా పెరుగుతాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఐరోపాలో రోజూ లక్ష కేసులు నమోదువుతున్నాయి. బ్రిటన్, ఇటలీ, స్విట్జర్లాండ్‌లో దాదాపు 20వేల కేసులు నిర్దారణ అవుతున్నాయి. వీటితో పాటు రష్యా ఇతర దేశాల్లో భారీగా వైరస్ బారినపడుతున్నారు. రోజుకు 7,500కుపైగా కరోనా మరణాలు నమోదుకాగా.. ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 5,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఐసీయూలో కేస్ లోడ్ పెరుగుతోందని సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు.‘మరణాల పెరుగుదల రెండు వారాల పాటు పెరుగుతున్న కేసుల కంటే తక్కువగానే ఉంది, మరణాల రేట్లు తగ్గుతుందని సంతృప్తి చెందకూడదు’ అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 38 మిలియన్ల మంది కోవిడ్ బారినపడగా.. వీరిలో 1.1 మిలియన్ల మంది బలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: