నిజానికి బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటు ఉండదన్న ప్రచారముంది. ఈ నేపథ్యంలో బండారు దత్తాత్రేయ కుమార్తె రాజకీయ ప్రవేశం విషయం కాషాయపార్టీలో చర్చకు దారితీసింది. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను బీజేపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తుంటారు. అయితే బండారు దత్తాత్రేయ క్రియాశీల రాజకీయాలకు దూరంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో హరియాణ గవర్నర్ కొనసాగుతున్నారు. ఇకపై దత్తాత్రేయ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో తన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తె విజయలక్ష్మిని రాజకీయ రంగ ప్రవేశం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు దత్తాత్రేయ వారసురాలిగా విజయలక్ష్మి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానకి బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి.. కేంద్రమంత్రిగా పనిచేశారు. దత్తాత్రేయ నాలుగుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 లోక్సభ దత్తన్న స్థానంలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి హోదాలో ఉన్నారు. అయితే గతంలో కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఎంపీగా ఉండటంతో అంబర్ పేట్ నియోజకవర్గం ఖాళీగా ఉంది. దీంతో అంబర్ పేట్పై దత్తన్న వారసురాలు విజయలక్ష్మి దృష్టి సారించారని కమలనాథులు చర్చించుకుంటున్నారు.