హైదరాబాద్ తరహాలో పరిపాలన, అభివృద్ధి ఒకే చోట కాకుండా.. వికేంద్రీకరణ జరగాలనే మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ఇంతకాలం చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ వాదనకు పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. దీనికి కారణాలేమైనా.. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తూ ప్రకటన చేస్తుందో చూడాలి.
మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక కారణాలు ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి అమరావతి రైతులు కోర్టుల్లో దాదాపు 54పిటిషన్లు వేశారు. దీంతో ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆగిపోయింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. కొత్త రాజధాని బిల్లును సిద్ధం చేసింది. అయితే ఇందులో కూడా సంచలనాలు ఉంటాయని తెలుస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తారా.. లేక విశాఖపట్నంను పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటిస్తారా..? అనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు గానీ.. ముందు ముందు ఏం చేయబోతున్నారేది ఉత్కంఠగా మారింది.