అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడయ్యాక డొనాల్డ్ ట్రంప్ భారత్కు రావడం ఇదే తొలిసారి. అందుకే హౌడీ మోడీ కార్యక్రమాన్ని మించి(గతంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లిన సందర్భంలో నిర్వహించిన కార్యక్రమం) భారత్లో ఘన స్వాగతం తెలపడానికి గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డు సృష్టించనున్న మొతేరా స్టేడియంలో లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్, మోదీలు ప్రసంగించనున్నారు. తనపై అభిశంసన తీర్మానంలో నెగ్గి నవంబర్లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
విదేశంలో లక్ష మంది హాజరయ్యే ఒక భారీ కార్యక్రమంలో మాట్లాడే తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధ్యక్ష ఎన్నికల వేళ ఇవన్నీ తనను ‘ప్రపంచంలో అగ్రనేత’గా నిలబెడతాయని ట్రంప్ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు సమదూరం పాటిస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో ఆర్థికమందగమన పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో భారత్కు అమెరికా సాయం చాలా అవసరం.
అలా ‘విన్ అండ్ విన్’ పాలసీతో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొందరు అమెరికన్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ పర్యటన ద్వారా ట్రంప్ రాజకీయ లబ్ధిని ఆశిస్తున్న విషయం కళ్లకు కడుతోంది. ఇక, భారత ప్రధాని మోడీ విషయానికి వస్తే.. ఇప్పుడు ఆయన ఇంటా బయటా కూడా తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటు న్నారు. కా, ఎన్నార్సీ వంటి బిల్లుల కారణంగా ముస్లింల నుంచి దేశంలోతీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క కశ్మీర్ను విభజించడం, ఆర్టికల్ 370 వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ కూడా గుర్రుగా ఉంది. పాక్తో ఇంకా అనేక విషయాల్లో వైరం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను పక్కదారి పట్టించేందుకు ఈ పర్యటనను మోడీ వాడుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేమసమయంలో అంతర్జాతీయంగా భారత్ బలీయమైన శక్తిగా అవతరించే క్రమంలో అగ్రరాజ్యం అండ తమకు ఉందనిచెప్పుకొనేందుకు కూడా మోడీ వ్యూహాత్మకంగా ట్రంప్ పర్యటను వినియోగించుకోవచ్చనే విశ్లేషణలు సాగుతున్నాయి.