దేశ ఆర్ధిక రాజధాని రాష్ట్రం మహారాష్ట్రలో ఇప్పుడు ఒక సంఘటన విషయమై విపరీతమైన చర్చ జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి ధనుంజయ్ ముండే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే, మంత్రి ధనుంజయ్ ముండే నుంచి తనకు ప్రాణహాని ఉందని సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను మంత్రి ధనుంజయ్ ముండే కొట్టిపారేశారు. ఫేస్‌బుక్ ద్వారా స్పందించిన ఆయన.. ఆమె తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఎందుకంటే తాను ఆ మహిళ సోదరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అన్నారు.


‘పోలీసులకు ఫిర్యాదుచేసిన మహిళ సోదరితో తాను చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నానని.. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అలాగే ఆమెను నా భార్యగా అంగీకరించాను’ అని అన్నారు. మంత్రిపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ఇక దీనిపై స్పందించిన ఎన్‌సీపీ నేత శరద్ పవార్.. ఈ అంశంపై అంతర్గతంగా చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అంతేకాదు, ఆరోపణలపై ముండే తనతో చర్చించినట్టు తెలిపారు. ‘నా అభిప్రాయం ప్రకారం అతడిపై (ముండే) ఆరోపణలు చాలా సీరియస్.. ఓ పార్టీగా ఈ అంశంపై చర్చించడం సహజం.. దీనిపై పార్టీలోని కీలక సహచరులతో కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. వారి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాతనే మరిన్ని చర్యలు తీసుకుంటాం.. మేము వీలైనంత త్వరగా దీన్ని చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.


 


కాగా, శరద్ పవార్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, జలవనరుల మంత్రి జయంత్ పాటిల్, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తదితర నేతలు గురువారం రాత్రి అత్యవసరంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. దీనిపై మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ఇవి కేవలం ఆరోపణలేనని, అంతమాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. పోలీసుల విచారణ నివేదిక ఆధారంగానే ఏదైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్న మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వారు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మంత్రి ధనుంజయ్ ముండే వ్యాఖ్యానించారు. తాను బాంబే హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమని సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామి శివసేన వ్యాఖ్యానించారు.




‘పార్టీలో అంతర్గతంగా పరిస్థితి ఖచ్చితంగా సమీక్షించి.. అవసరమైతే, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్థాయిలో వాస్తవాల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటాం’అని జయంత్ పాటిల్ అన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ ఇది వ్యక్తిగత, కుటుంబ అంశంమని, మంత్రి ముండే దీనిని పరిష్కరించుకోగలరని వ్యాఖ్యానించారు. తనపై 2006 నుంచి మంత్రి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆయనపై ముంబయి పోలీస్ కమిషనర్‌కు జనవరి 10న ఫిర్యాదు చేసినట్టు ఓ ఔత్సాహిక గాయని (37) తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది. తన ఫిర్యాదును పోలీసులు పక్కనబెట్టారని ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: