తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించే స్థాయికి చేరుకున్నామని  రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించారన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో విద్యుత్ కొనుగోలు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ప్లాంటు పూర్తిగా ప్రభుత్వ విద్యుత్ సంస్థ అన్నారు. దానికి బొగ్గు సరఫరా కూడా కోల్ ఇండియా నుంచి జరుగుతుందన్నారు.



అది తక్కువ ధరకు వస్తుందని మంత్రి తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థ నుంచే రాష్ట్రానికి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.  జెన్‌కో తరహాలోనే ఆ రాష్ట్రంలో ఆ సంస్థ కూడా అంతేనని చెప్పారు.అక్కడి నుంచి మనం తీసుకుంటున్న ధర రూ. 3.90 పైసలు మాత్రమే. అదేవిధంగా ట్రాన్స్‌మిషన్ కోసం చెల్లిస్తున్నది మరో 45 పైసలు. మొత్తం కలిపి రూ. 4.35 పైసలు మాత్రమేనన్నారు. మనం ఇవాళ ఇక్కడి విద్యుత్ సంస్థలకు సరాసరిగా చెల్లిస్తున్న ధర రూ. 4.46 పైసలు అన్నారు.





అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి ఏదో వాళ్లు తక్కువ ధరకు ఇస్తామంటే ప్రభుత్వం తీసుకోలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎన్టీపీసీ మనకు రూ.4.50 పైసలకు ఎప్పుడూ ఆఫర్ చేయలేదన్నారు. రూ. 4. 61 పైసల నుంచి రూ. 5. 10 పైసల మధ్యన ఆఫర్ చేసినట్లు ఆ మేరకే వివిధ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా నమ్మకం కలిగించిన మొదటి అంశం విద్యుత్ సరఫరా అన్నారు. విద్యుత్ విషయంలో సీఎం కేసీఆర్ తపన, అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: