క్రికెట్లో జాతి వివక్షపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ బోర్డులు దీనిపై దృష్టి సారించాయి. తమకందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక కమిటీలను నియమించి విచారణ కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యార్క్షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్ అండర్-19 కెప్టెన్ అజీం రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇందులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. యార్క్షైర్ కౌంటీలో తెల్ల జాతీయులు నల్లజాతీయులతో కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోంది. అందులో భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడ ఉన్నాడట.
అవును ఇంగ్లాండ్లోని యార్క్షైర్ క్రికెట్ కౌంటీకి పుజారా ఒకప్పుడు ఆడేవాడు. అదే సమయంలో అతడిని తోటి ఆటగాళ్లు రంగు ఆధారంగా వివక్ష చూపేవారట. ఈ విషయాన్ని అదే కౌంటీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి బయటపెట్టాడు. ఒక్క పుజారానే కాదని, నల్లజాతీయులందరినీ వారు వివక్షతోనే చూసేవారని, అందరినీ ఒకే పేరుతో పిలిచేవారని చెప్పుకొచ్చాడు. పుజారా విషయంలో అయితే అతడి పేరు పలకలేకపోవడం వల్లనే అలా పిలుస్తున్నామనేవారని ఆటగాళ్లు సమాధానమిచ్చేవారంటూ వివరించాడు.
ఇదిలా ఉంటే నల్లజాతీయుడై జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలోని పోలీసుల చేతిలో మరణించిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ లివ్స్ మ్యాటర్స్కు విపరీతమైన మద్దతు లభించింది. క్రికెట్లో కూడా జరుగుతున్న వివక్షపై వెస్టిండీస్ క్రికెర్లు గళమెత్తారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్ మఖాయా ఎన్తినీ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.