నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే సమస్య ఒత్తిడి. ఎంతటి బలవంతుడైనా ఒత్తిడి చిత్తు చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము కూడా. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది.
ఇక మన రోగనిరోధక శక్తి మనల్ని అనేక రకాల జబ్బులనుంచి నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. కానీ ఒత్తిడి అనే ఒకే ఒక సమస్య కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి.. ఫలితంగా అనేక రకాల జబ్బులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఒత్తిడి, ముఖ్యంగా పని, సంబంధాలు మరియు డబ్బు సమస్యలను వల్ల కలిగేది. బాధాకరమైన జీవిత సంఘటనలు కూడా ఒత్తిడికి దారితీస్తాయి. అయితే ఒత్తిడి వల్ల ఓ ప్రయోజనం కూడా ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. అవును! మీరు విన్నది నిజమే. ఎన్నో అనారోగ్యాలకు కారణమయ్యే ఒత్తిడ వల్ల కూడా ఓ ప్రయోజనం ఉంది.
ఒత్తిడి గురించి ఇటీవల పరిశోధనలు చేసిన అమెరికాలోని పెన్ స్టేట్ వర్సిటీ పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. మనిషిలో ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పారు. పని, చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో మనుషులు పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తోటివారు నైతిక మద్దతు పలుకుతున్నారని గుర్తించారు. వారికి తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారని తేల్చారు. దీంతో ఒత్తిడి వల్ల సామాజిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇక కొంత మేరకు ఒత్తిడి వల్ల పనిలో రాణిస్తారని కూడా చాలా మందికి తెలుసిన విషయమే.