కరోనా వైరస్ క్షణక్షణానికి విస్తరిస్తోంది. ఇప్పటి వరకు చైనాకు మాత్రమే పరిమితం అనుకున్న ఈ వైరస్ ఇప్పుడు ఖండాలు దాటి విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 11 దేశాలకు ఈ వైరస్ విస్తరించినట్టుగా అమెరికన్ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఈ స్థాయిలో వైరస్ వ్యాపించడం అంటే మాములు విషయం కాదు. అయితే, వైరస్ వ్యాపించడం వెనుక ఉన్న అనేక కోణాలు ఉన్నాయి.
చైనాలో పుట్టిన ఈ వైరస్, గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా నుంచి వివిధ దేశాలకు ప్రజలు నిత్యం రవాణా చేస్తుంటారు. ఒకచోట నుంచి నుంచి చోటికి మనిషి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటికే వైరస్ ప్రభావం కారణంగా 170 మంది మరణించారు. ఈ సంఖ్య వందల నుంచి వేలు లక్షలుగా మారే ప్రమాదం ఉన్నది. ఇండియాతో పోలిస్తే చైనాలో వైద్యవిద్య ఖరీదు చాలా తక్కువ. అందుకే ఇండియా నుంచే వేలాదిమంది విద్యార్థులు చైనా వెళ్లి అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తుంటారు.
ఇలా చైనాలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో వైరస్ ఉన్నది కాబట్టి అది ఎక్కడ తమ పిల్లలకు వ్యాపిస్తుందో అని భయం చెందుతున్నారు. ఇదిలా ఉంటె, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఉన్న అవనిగడ్డలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈనెల 12 వ తేదీన చైనా నుంచి ఓ యువతి సొంతవూరు అవనిగడ్డ వచ్చింది. చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తోంది.
చైనా నుంచి యువతి రావడంతో అధికారులు, వైద్య అధికారులు ఆమెను తమ పర్యవేక్షణలోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి ప్రభావం లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయినప్పటికీ ప్రజలు ఇంకా భయాందోళనలు చెందుతూనే ఉన్నారు. అవగాహన లోపం కారణంగానే ఇలా జరుగుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు.