సూర్యకుమార్ యాదవ్..! ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వికెట్లు కోల్పోతున్నా..సహనం కోల్పోకుండా సూర్యకుమార్ చేసిన బ్యాటింగ్ అద్భుతం. సింగిల్ హ్యాండెడ్గా ముంబైను విజయ తీరాలకు చేర్చాడు సూర్య కుమార్. 43 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 362 పరుగులు చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆస్ట్రేలియా టూర్కు ఇలాంటి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఎంపిక చేయడంపైనే అసలు చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడైన సూర్యకుమార్ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందంటూ మాజీలు సెలక్షన్ కమిటీపై ఫైరవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ గత నాలుగేళ్ల నుంచి ఐపీఎల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. రంజీల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ల్లో సూర్యకుమార్ ఒకడు. తన కెరీర్లో సూర్య సూపర్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్ను సెలక్షన్ కమిటీ ఎందుకు ఎంపిక చేయలేదని మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఎంపికకు ఫామ్, ఫిట్నెస్ ప్రమాణాలు కాకుండా ఇంకేముంటాయని మాజీలు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
నిజంగానే మాజీ క్రికెటర్లు చెప్పినట్లుగానే సూర్యకుమార్ మంచి టాలెంటెడ్ ప్లేయర్. క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడటంలో దిట్ట. రంజీల్లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. రికార్డులు కూడా గొప్పగా ఉన్నాయి. అందుకే మాజీ క్రికెటర్లు బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. టీమిండియాకు ఎంపిక అవ్వాలంటే సూర్యకుమార్ ఇంకేం చేయాలో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ఆసీస్ టూర్కు ఎంపికైన చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లో రాణించిన వారే. అందుకే జట్టు ఎంపికకు ఏ ప్రమాణాలు పాటించారని సెలక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా ఎంపికపై దుమారం రేగుతోంది. సెలక్షన్ కమిటీపై మాజీల విమర్శలు చెలరేగుతున్నాయి. ఆటగాళ్ల ప్రమాణాలపై పెద్ద చర్చే నడుస్తోంది.