హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘మా హైదరాబాద్‌ పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎందుకు చేస్తారు? హైదరాబాద్ ‌పై సర్జికల్ ‌ స్ట్రైక్స్‌ చేస్తారా? సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా? దమ్ము, ధైర్యం ఉంటే.. విజన్‌ అనే పదానికి విలువ తెలిస్తే.. దేశంలోని బీదరికంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలి. నిరుద్యోగ సమస్యపై చేయండి. మత విద్వేషాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై చేయండి. తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వాళ్లపై చేయండి.. మీ సర్జికల్ ‌స్ట్రైక్స్‌’’ అంటూ  నిప్పులు చెరిగారు.

సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ బీజేపీ నాయకులు పిచ్చిపట్టిన వారిలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అందరిదనీ, దాన్ని కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీని విమర్శించారు. ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంగళవారం సాయంత్రం గాంధీ నగర్‌ లింక్‌ బ్రిడ్జ్‌, రాంనగర్‌ చౌరస్తాల్లో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ, ‘మనం హైదరాబాద్‌లో ఉన్నా కూడా.. ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదు’ అన్నారు. పచ్చని హైదరాబాద్‌ - తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

‘‘ఓట్లు కావాలంటే బండి సంజయ్‌ ప్రజల కాళ్లు పట్టుకుంటే వేస్తారు కదా? ఒక్క ఎన్నిక కోసం బీజేపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం బండి సంజయ్‌ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారట. నాలుగు ఓట్ల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడడాన్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా’’ అని ఎద్దేవా చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ కులాలను వర్గాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: