గ్రేటర్ ఎన్నికల్లో 55 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీఆర్ఎస్.. మరోసారి మేయర్ పీఠాన్ని అధిష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే, మేయర్ పదవి ఈసారి మహిళకు రిజర్వ్ కావడంతో.. గులాబీ దళం నుంచి గెలుపొందిన మహిళా కార్పొరేటర్లలో ఎవరిని ఆ అదృష్టం వరించనుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి.
బల్దియా ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థుల్లో.. 23 మంది మహిళలు ఉన్నారు. వీరిలో మేయర్ పదవిని ఎవరిని వరిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి రెండోసారి గెలుపొందిన పలువురు మహిళా కార్పొరేటర్లు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, బంజారాహిల్స్ నుంచి విజయం సాధించిన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేర్లు ఈ లిస్టులో ప్రధానంగా వినిపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి పేరు కూడా తెరమీదకొచ్చింది. భారతినగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్గా గెలుపొందారు సింధు. ఇక, గత ఎన్నికల్లో గెలిచిన మేయర్ కుర్చీని దక్కించుకున్న బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి కూడా.. ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరు కూడా మేయర్ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే గులాబీ బాస్ ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ కుర్చీ ఎవర్ని వరిస్తుందో తెలియాలంటే.. మరి కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే.
నగరంలో ఇప్పటివరకు ముగ్గురు మహిళలు మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా రాణి కుముదినీ దేవి వ్యవహరించారు. 1962లో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రాణీ కుముదినీ దేవి తర్వాత సరోజనీ పుల్లారెడ్డి 1965-66 మధ్యకాలంలో మేయర్గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని సొంతంచేసుకుంది. ఆపార్టీ నుంచి గెలిచిన బండ కార్తీకరెడ్డి మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. మరి, ఇప్పుడు జీహెచ్ ఎంసీ మేయర్ కాబోయే నాలుగో మహిళ ఎవరనేదానిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.