ఏపీలో ఏక‌గ్రీవ పంచాయ‌తీల ముసుగులో పంచాయ‌తీల వేలం పాట‌లు మొద‌లయ్యాయి. ఓట్లు కొన‌డం అన్న‌ది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ద్ధ‌తి.. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో ట్రెండు మారిన‌ట్లుగా ఉంది అధికారా పార్టీ.... ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు అనే తేడా లేకుండా ఏపీలోని అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏక‌గ్రీవాల ముసుగులో పంచాయ‌తీల వేలం పాట‌ల‌కు తెర‌లేపుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ త‌ర‌హా ఏక‌గ్రీవాల‌కు అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నిజాయితీగా, గ్రామాభివృద్ధి కోసం-స‌మైక్య‌త‌తో ప్ర‌జ‌లంద‌రూ క‌ల‌సి తీసుకునే ఏక‌గ్రీవాల‌ను ఆహ్వానించ‌ద‌గ్గ‌వే.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు, ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు అందిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో జారీ చేసింది.


అయితే త‌మ‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే ప్ర‌భుత్వం నుంచి  రూ.20ల‌క్షలు వ‌స్తాయ‌ని, అలాగే పాల‌క‌వ‌ర్గం త‌రుపున 20 నుంచి 25ల‌క్ష‌లు ఇస్తామంటూ కొన్నిచోట్ల ఆశావ‌హులు గ్రామ‌స్థుల‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  కృష్ణా, గుంటూరు, ఉభ‌య గోదావ‌రి, క‌డ‌ప జిల్లాల్లో  అయితే  కోటి రూపాయ‌ల వ‌ర‌కు కూడా హామీలు ప్ర‌జ‌ల‌పై గుప్పుతున్న‌ట్లు స‌మాచారం. అధికార పార్టీకి చెందిన కొంత‌మంది నేత‌లు ఎక్కువ చొరవ చూపుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. క్షేత్ర‌స్థాయిలో వీక్‌గా ఉన్న వైసీపీయే ఏక‌గ్రీవాల ముసుగులో పంచాయ‌తీల‌ను చేజిక్కించుకోవాల‌ని చూస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తుండ‌గా... ఆ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని, టీడీపీయే అలాంటి దుర్మార్గాల‌కు పాల్ప‌డుతుంద‌ని వైసీపీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: