ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం చేస్తే రూ.5 లక్షలు, 2 వేల నుంచి 5 వేల జనాభా పంచాయతీల ఏకగ్రీవానికి రూ.10 లక్షలు, ఇక 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల ప్రోత్సాహక నిధులు అందిస్తామని ప్రకటించింది. అంతేగాకుండా 10 వేల జనాభా పైనున్న పంచాయతీ ఏకగ్రీవాలకు రూ.20 లక్షలు అందించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో జారీ చేసింది.
అయితే తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి రూ.20లక్షలు వస్తాయని, అలాగే పాలకవర్గం తరుపున 20 నుంచి 25లక్షలు ఇస్తామంటూ కొన్నిచోట్ల ఆశావహులు గ్రామస్థులకు ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, కడప జిల్లాల్లో అయితే కోటి రూపాయల వరకు కూడా హామీలు ప్రజలపై గుప్పుతున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఎక్కువ చొరవ చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీక్గా ఉన్న వైసీపీయే ఏకగ్రీవాల ముసుగులో పంచాయతీలను చేజిక్కించుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఆ అవసరం తమకు లేదని, టీడీపీయే అలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని వైసీపీ చెబుతోంది.