కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయనో, లేదంటే వారసత్వంగా వస్తున్నాయన్న కారణంగానో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్యూ) నడపలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నష్టదాయక పీఎస్యూలు దేశ ఆర్థిక వ్యవస్థకు గుదిబండలా మారాయని, కేవలం పన్నుచెల్లింపుదారులు(ట్యాక్స్ పేయర్ల) మద్దతుతోనే నడుస్తోన్న ఆ సంస్థలు.. పన్నులు చెల్లించలేని పేదలు, నిరుద్యోగ యువకుల పాలిట భారంగా మారాయన్నారు. ఆ బరువును ఇప్పుడు దించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాలం మారుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలని, అలాగే వ్యాపార వ్యూహాల్లో కూడా మార్పురావాలని సూచించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ శాఖ) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై బుధవారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ఈసారి బడ్జెట్ కంటే ముందే పలు రంగాల వ్యక్తులతో విస్తృతంగా చర్చించాం. ఈ ఏడాది బడ్జెట్ ద్వారా భారత్ ను మళ్లీ అభివృద్ది పట్టాలు ఎక్కించేలా స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాం. నిజంగా ప్రజల అవసరాలను తీర్చేవి, , దేశ వ్యూహాత్మక విధానాలకు పనికొచ్చేవి తప్ప దాదాపు అన్ని ప్రభుత్వం రంగ సంస్థలూ భారంగా మారిన నేపథ్యంలో ఆ బరువును దించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని సంచలన ప్రసంగం చేశారు. ఇతవరకూ ఎవరూ చేయలేని సాహసాన్ని తాము చేపట్టామని, వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ నష్టాల్లో ఉన్నాయని, నిజం చెప్పాలంటే పన్ను చెల్లింపుదారుల(ట్యాక్స్ పేయర్ల) మద్దతుతోనే అవి నడుస్తున్నాయని, మరి పన్నులు చెల్లించలేని పేదలు, నిరుద్యోగ యువత సంగతేంటి? అని మోడీ ప్రశ్నించారు. చెల్లింపుదారుల నుంచి వస్తోన్న డబ్బును ఇలా నష్టాల్లో ఉన్న సంస్థలకు మళ్లిస్తే.. పేదలు, యువతకు ఎలా న్యాయం చేగలం? ప్రభుత్వ విధానం ముమ్మాటికీ వ్యాపార, వాణిజ్యాలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప.. ప్రభుత్వమే వ్యాపార సంస్థగా ఉండటానికి వీల్లేదన్నారు.