అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అయ్యారు. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 4న గురువారం కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. గురువారం కర్నూలు, 5న తిరుపతి, 6న విశాఖపట్నం, 7న విజయవాడ, 8న గుంటూరులో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై ప్రత్యర్థులు, నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో సాయంత్రానికి ఎవరు బరిలో నిలుస్తున్నారో స్పష్టత రానుంది.అయితే నిన్నటివరకు వచ్చిన నామినేషన్లను ఓ సారి పరిశీలిస్తే రాష్ట్రంలో మొత్తం 671 డివిజన్లు, 2,123 వార్డుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. వీటికి మొత్తం 17,415 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ఏకంగా 2,502 మంది మంగళవారం పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ 92 ఉపసంహరణలతో రాష్ట్రంలోనే టాప్ పొజీషన్లో నిలబడడం గమనార్హం. చిత్తూరు కార్పొరేషన్లో 90, విజయవాడలో 83, తిరుపతిలో 60 మంది అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నారు.
అలాగే గుంటూరు కార్పొరేషన్లో 33, కర్నూలు కార్పొరేషన్లో 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గెలుపోటములను పక్కన పెడితే కనీసం పోటీలో నిలిచామని చెప్పుకోడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాయకుల పరువు కోసం అభ్యర్థులు బరిలో నిలుస్తారా? లేక ఉపసంహరణ దారి వెతుక్కుంటారా? అనే దానిపై సాయంత్రం నాలుగు గంటలకల్లా క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో కనీసం సగం సీట్లలో కూడా అభ్యర్థులు లేని పార్టీ తరపున చంద్రబాబు ఏమని ప్రచారం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.