తెలంగాణలో కొవిడ్ పంజాతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పట్టణాలు, నగరాల్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో మున్సిపల్ శాఖను అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు.మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సహా అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా అన్ని పురపాలికల్లో వెంటనే సానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, క్రిమిసంహారక ద్రావకాన్ని పిచికారీ చేయాలని మంత్రి ఆదేశించారు.కోవిడ్ విస్తరిస్తుండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ వద్ద ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ప్రత్యేకంగా వాహనాలను అద్దెకు తీసుకుని సోడియం హైపోక్లోరేట్ ద్రావకం పిచికారీ చేయాలని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతి నిధులు వినియోగించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ క్రిమిసంహారకాల స్ప్రే జరగాలని మంత్రి అన్నారు.కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, శాఖలో ఉన్న అందరు ఉద్యోగులు విధిగా విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రి కేటీఆర్ కోరారు.దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీలో ఆదివారంతో వందశాతం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: