అసలు తాను తీసుకున్న రుణం కంటే ఎక్కువే దర్యాప్తు సంస్థలు తన ఆస్తులు జప్తు చేసుకున్నాయంటున్నాడు మాల్యా మామ. బ్యాంకుల నుంచి తాను చేసిన అప్పుకు దాదాపుగా రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందంటున్నాడా జంపింగ్ జపాంగ్. అంతే కాదు.. తాము జప్తు చేసుకున్న ఆస్తులు ఎక్కడ ఈడీకి ఇవ్వాల్సి వస్తుందోననే తనను దివాలా దారుగా ప్రకటించాలని ఇండియన్ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని విమర్శించారు.
అయితే దీనిపై మాల్యా చెబుతున్న లెక్కలు కూడా ఇంట్రస్టింగ్ గానే ఉన్నాయి. అదెలాగంటే.. విజయ్ మాల్యా వాదన ప్రకారం.. ఆయన ప్రభుత్వ బ్యాంకుల నుంచి మొత్తం రూ.6.2వేల కోట్లు రుణంగా తీసుకున్నాడట. కానీ.. ఇప్పటి వరకూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈడీ రూ.14వేల కోట్ల విలువైన విజయ్ మాల్యా ఆస్తులను జప్తు చేసిందట. అంతే కాదు.. ఈ డీ తాను జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులకు అప్పగించిందట. అందులో కొన్ని ఆస్తులను బ్యాంకులు ఇప్పటికే వేలం వేశాయి. అలా వేలం వేయగా ఇప్పటి వరకూ రూ.9వేల కోట్ల వరకు నగదు వచ్చిందట.
సో.. అప్పుడు తీసుకుంది 6 వేల కోట్లు.. వసూలు చేసింది 14 వేల కోట్లు.. అంతే కాక.. మరో 5 వేల కోట్లు సెక్యూరిటీగా కూడా పెట్టుకున్నాయట. ఇప్పుడు అలా అదనంగా తాము ఉంచుకున్న డబ్బు ఎక్కడ ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని బ్యాంకులు కోర్టుకు వెళ్లాయట. ఇదీ విజయ్ మాల్యా వాదన.