ఈ క్రమంలోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు. ఇటీవలే భారత వ్యాక్సినేషన్ లో వంద కోట్ల మార్క్ కూడా చేరుకుంది. ఇలా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకుంటుంటే.. కొంత మంది మాత్రం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొంతమంది మొదటి డోస్ వేసుకొని రెండవ డోసు వేసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తుంటే.. మరికొంతమంది మొత్తానికే వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యం లో ప్రస్తుత సమయంలో కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు వివిధ ఆఫర్లను ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే పలుచోట్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి బహుమతులు ఇవ్వడం లాంటి ఆఫర్లు కూడా ప్రకటించారు. ఇటీవలే మధ్యప్రదేశ్లోని మంద్ సార్ అనే పట్టణంలో.. అందరినీ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించేందుకు వెరైటీ మార్గం ఎంచుకున్నారు. టీకా రెండవ డోసు వేసుకున్న వారికి దేశీ మద్యంపై 10 శాతం తగ్గింపు అందిస్తాం అంటూ అధికారులు ప్రకటించారు. మెగా వ్యాక్సిన్ కాంపెయిన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక ఈ చిన్ని ప్రయత్నం విజయవంతం అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు అధికారులు.